విశాఖను అదానీ, జిందాల్ వంటి సంస్థల నుంచి కాపాడుకోవాలి: ఏబీ వెంకటేశ్వరరావు
- విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఏబీ వెంకటేశ్వరరావు
- 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం దారుణమని వ్యాఖ్య
- డేటీ సెంటర్ల వల్ల లభించే ఉద్యోగాలు తక్కువగా ఉంటాయన్న ఏబీ
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని... ఆదానీ, జిందాల్ వంటి కార్పొరేట్ శక్తుల నుంచి నగరాన్ని రక్షించుకోవాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. విశాఖలో 'తెలుగు శక్తి' ఆధ్వర్యంలో జరిగిన మేధోమథనం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ను జిందాల్, విశాఖ భూములు, పోర్టును ఆదానీ సంస్థలు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు.
32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. 600 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం దారుణమని మండిపడ్డారు. భూములను ఎకరం కేవలం 99 పైసలకే కేటాయిస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్ల వంటి వాటికి ప్రభుత్వ పరంగా భారీగా రాయితీలు ఇస్తున్నప్పటికీ... వాటి వల్ల లభించే ఉద్యోగాలు తక్కువగా ఉంటాయని అన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ... సుమారు రూ. 10 వేల కోట్లు కేటాయిస్తే జంజావతి వంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. ఏటా 15 శాతం ఆస్తి పన్ను పెంచుతూ మధ్యతరగతి ప్రజలపై భారం మోపడం సరికాదని అన్నారు. ప్రజలు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా తమ హక్కుల కోసం వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం మేధావులు, ప్రజలు సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.